మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ తీవ్ర ఆందోళనకరమని అన్నారు. అక్కడ వీలైనంత త్వరగా శాంతికరమైన వాతావరణం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పౌరులపై దాడులను, అంతర్జాతీయ వాణిజ్య రవాణా మార్గాలకు ఆటంకం కలగడంపై భారత్ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్ లో జరిగిన ‘ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్’లో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత రవాణ కీలకమని స్పష్టం చేశారు. ఈ సదస్సులో నేపాల్, భూటాన్, సీషెల్స్ దేశాల విదేశాంగ మంత్రులతో జైశంకర్ సమావేశమయ్యారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో జైశంకర్ జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిత్సు మొతెగీతో ఫోన్లో మాట్లాడారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి, ఇంటర్నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీపై వారిద్దరూ ప్రధానంగా చర్చించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 8 మంది భారతీయులు దాడుల్లో మరణించడంపై తొషిమిత్సు సంతాపం వ్యక్తం చేశారు. ఇంధనం, వనరుల సరఫరా భద్రత గురించి ఇరు దేశాలు కలసి పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.