ఇటీవలే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలపైనే దేశవ్యాప్తంగా రాజకీయ పరిశీలకుల దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 291 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించేశారు. కాళీఘాట్ లోని తన నివాసంలో ఆమె ఈ జాబితాను ప్రకటించారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ లో 291 స్థానాల్లో టీఎంసీ పోటీచేస్తుండగా..మిగిలిన 3 సీట్లను డార్జిలింగ్ హిల్స్ లోని భారతీయ గుర్ఖా ప్రజాతాంత్రిక్ పార్టీకి కేటాయించినట్లు తెలిపారు. పార్టీకి ఉన్న 234 మంది ఎమ్మెల్యేలలో 135 మందికి మరోసారి చోటు దక్కింది. 15 మంది ఎమ్మెల్యేలను స్థానాలు మార్చారు. భవానీ పూర్ నుండి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. 2021లో ఆమె సువెందు అధికారి చేతిలో నందిగ్రామ్ స్థానంలో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరూ పోటీ పడనున్నారు. ప్రధానంగా బీజేపీ, టీఎంసీల మధ్య పోటీ ఉంది. దీంతో బెంగాల్ ఎన్నికలలో ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొనివుంది. పశ్చిమ బెంగాల్ లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది ఏప్రిల్ 23న మొదటి విడతలో 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను మే 4న ప్రకటించనున్నారు.