భారతీయ జనతా పార్టీ 47వ వసంతంలో అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ కి, ఇతర ముఖ్య నాయకులకు, ఆ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా ముందుకు వెళ్తోందని మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్, ఎల్.కె. అద్వానీ లాంటి మహనీయుల సంకల్పం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అచంచల విశ్వాసంతో కూడిన పోరాటంతో నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా కీర్తిని ఆర్జించిందని కొనియాడారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో సైతం సమర్ధవంతమైన విధానాలు అమలు చేస్తూ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిందన్నారు. భారతీయ జనతా పార్టీ వికసిత్ సంకల్పం దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తున్నాను.