దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు నేటి ట్రేడింగ్ లో తెరపడింది. ఈరోజు నష్టాలతో సూచీలు ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ సుమారు 931 పాయింట్లు నష్టంతో 76,631 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 222 పాయింట్లు నష్టపోయి 23,775 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.92.57గా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై మళ్లీ సందిగ్దత నెలకొనడం ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించేలా చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇక నేటి ట్రేడింగ్ లో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్టీపీసీ, టీసీఎస్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, బీఈఎల్ షేర్లు లాభాల్లో కొనసాగాయి. ఎల్ అండ్ టీ, ఎటర్నల్, హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు, ఐసీఐసీఐ షేర్లు నష్టపోయాయి.