గత రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరించి అగ్రనటిగా కొనసాగుతున్నారు త్రిష. వర్షం, అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కృష్ణ, కింగ్, ఆడవారి మాటలకు అర్దాలే వేరులే ఇలా ఎన్నో తెలుగు చిత్రాల్లో తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యారు. నేడు ఆమె పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఆమె నటిస్తున్న సినిమాల నుండి కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఇందులో చిరుకు జోడీగా త్రిష, అషికా రంగనాథ్ నటిస్తున్నారు. త్రిషకు శుభాకాంక్షలు చెబుతూ ఆ మూవీ టీమ్ తాజాగా ఒక పోస్టర్ విడుదల చేస్తోంది. ఇందులో ఆమె అవని పాత్రలో కనిపించనుంది. ఇక సూర్య హీరోగా ఆర్జే బాలాజీ రూపొందిస్తున్న సినిమా ‘కరుప్పు’ . తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో రానుంది. ఇందులో త్రిష పాత్రకు సంబంధించిన లుక్ ను కూడా తాజాగా విడుదల చేశారు. ఆమె ప్రీతి పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ వీడియో పంచుకున్నారు. ఈ చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.