సూపర్ స్టార్ రజనీ కాంత్ అంటే తెలియని వారు ఉండరు. భారతీయ సినిమా పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక విషయం అభిమానులను ఆనందంలో ముంచేసింది. ఆయన తన జీవిత ప్రయాణాన్ని ఆత్మకథ రూపంలో అభిమానులతో పంచుకోనుండడం ఈ ఆనందానికి కారణం. ఆయన కూతురు, డైరెక్టర్ సౌందర్య ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలిపారు. ఆమె కూడా ఈ పుస్తకం రాసే పనిలో పాల్గొన్నట్లు తెలిపారు. నాన్నగారు తన ఆత్మకథ రాస్తున్నారు. ఆ పుస్తకాన్ని ఎలా రూపుదిద్దుతున్నారో తాను దగ్గరుండి చూసినట్లు పేర్కొన్నారు. ఇక ఈ పుస్తకం ఇది చాలా ఏళ్ల పాటు పాఠకులు మళ్లీ మళ్లీ చదివే పుస్తకంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. యోగి పరమహంస యోగానంద గారు రాసిన ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకం తరతరాలకు ఎంత స్ఫూర్తినిస్తుందో మా నాన్నగారి కథ కూడా అలాగే ఉంటుందని సౌందర్య తెలిపారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే అతి పెద్ద నటులలో ఒకరిగా ఎదిగిన రజనీకాంత్ ప్రయాణం అసామాన్యం. ఆయన ఐదు దశాబ్దాల వ్యక్తిగత అనుభవాలు, వృత్తిపరమైన విజయాలు, ఆ స్థాయిలో నిలిచేందుకు ఎదుర్కొన్న సవాళ్లు తదితర వివరాలన్నీ ఇందులో ఉండనున్నట్లు సౌందర్య తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం అంటేనే ఒక అద్భుత ప్రయాణం. బస్ కండక్టర్గా మొదలై, ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక లెజెండ్గా మారిన ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఇప్పుడు, ఆయన తన జీవిత ప్రయాణాన్ని ఆత్మకథ రూపంలో అభిమానులతో పంచుకోనుండటం నిజంగానే ఒక గుడ్న్యూస్. ఈ వార్త రజనీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.రజనీకాంత్ ఆత్మకథ కేవలం సినీ అభిమానులకే కాదు, యువతకు, సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలనుకునే వారికి కూడా ఒక గైడ్గా నిలుస్తుంది. ఆయన జీవితం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. రజనీకాంత్ తన సినిమా కెరీర్తో పాటు, రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చేసిన ప్రయత్నాలు, ఆ తర్వాత వెనకడుగు వేయడం వంటి విషయాలపై కూడా ఆసక్తికరమైన వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఈ పుస్తకం ఆయన అభిమానులకు, సినీ విమర్శకులకు, పరిశోధకులకు ఒక విలువైన రిఫరెన్స్గా ఉంటుంది. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. సినీ విశ్లేషకులు ఈ ఆత్మకథ సినీ పరిశ్రమలో ఒక బెంచ్మార్క్గా నిలుస్తుందని భావిస్తున్నారు. రజనీకాంత్ ఆత్మకథ పుస్తక రూపంలో రాబోతుండటంతో, దీనిపై సినిమా తీసే అవకాశం ఉందా అనే చర్చ కూడా మొదలైంది. ఈ విషయంపై సౌందర్య స్పందిస్తూ, తన తండ్రి ఆత్మకథను సినిమాగా తీయడం తనకు ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ అవుతుందని అన్నారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.