ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు మరోసారి హవా చూపారు. ఇటీవల ఫామ్ తో ఇబ్బంది పడుతున్నప్పటికీ భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో ఓపెనర్ వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ మొదటి సారి టాప్-5లోకి దూసుకొచ్చాడు.
టీ20 వరల్డ్ లో ఇప్పటివరకు పెద్దగా రాణించకపోయినా, అభిషేక్ శర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ గా ఉండడం విశేషం. ఇక ఈ లిస్టులో ఇషాన్ కిషన్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 3వ ర్యాంకును చేరుకున్నాడు.
ఆల్ రౌండర్ల లిస్టులో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మళ్లీ నెంబర్ వన్ గా నిలిచాడు. భారత ఆల్రౌండర్ శివమ్ దూబే రెండు స్థానాలు ఎగబాకి 7వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా భారత ఆటగాళ్లు సత్తాచాటారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తన ర్యాంకును మెరుగుపరుచుకుని 8వ స్థానంలో నిలిచాడు. మరోవైపు సౌతాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్ ఏకంగా 21 స్థానాలు మెరుగుపరుచుకుని 3వ స్థానంలో నిలిచాడు.