లోక్సభ స్పీకర్ 60కి పైగా దేశాలతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. అందులో శ్రీలంక పర్యటించే సభ్యుల బృందానికి లీడ్ చేసే బాధ్యతను తనపై ఉంచినందుకు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కు ఎంపీ పురంధేశ్వరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భారత్ – ప్రపంచ వేదికపై మరింత గౌరవంతో, మరింత విశ్వాసంతో ముందుకు సాగుతుందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ప్రధాని మోదీ బహుపక్ష ప్రతినిధి బృందాలను ప్రపంచ దేశాలకు పంపించి, జాతీయ ప్రయోజనాల విషయంలో భారత్ ఏకమై ఉందనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి అందించారని తెలిపారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ స్పీకర్ ఈ ఫ్రెండ్షిప్ గ్రూపులను సంస్థాగతం చేయడం మరో కీలకమైన అడుగని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పార్లమెంట్-టు-పార్లమెంట్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, శాసన అనుభవాలను పంచుకోవడం, పరస్పర అవగాహన, సహకారం పెంపొందించే దిశగా తీసుకున్న ఈ చర్య భారత ప్రజాస్వామ్య వైవిధ్యాన్ని, పరిపక్వతను ప్రతిబింబిస్తోందని తెలిపారు.