ఏపీ సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు. రూ.456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు దోర్నాల మండలం, గంటవానిపల్లిలో శంకుస్థాపన చేశారు. అనంతరం అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సురవరం గండివీరారెడ్డి అనే రైతులతో కలిసి ఫీడర్ కెనాల్ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్బంగా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నమూనా పరిశీలన అనంతరం పనులపై అధికారులతో సీఎం సమీక్షించారు. వెలిగొండ టన్నెళ్ల పనులతో పాటు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న వేర్వేరు ప్రాంతాల్లోని అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా చంద్రబాబు సంభాషించారు.