వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి వేదపండితుల ఆశీర్వచనాలు పొందారు. నారా లోకేష్ దంపతులు సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారికి పట్టువస్త్రాలను తలమీద ధరించి, అమ్మవారికి పసుపు కుంకుమల సారెను తీసుకువచ్చి సమర్పించారు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 12 గంటలకు దేవస్థాన ఉత్సవ ప్రాంగణంలో వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ దంపతులు భక్తిశ్రద్ధలతో తిలకించి ఆశీర్వచనాలు పొందారు. స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.