ఇజ్రాయెల్,అమెరికా,ఇరాన్ ల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు మరింత ఉధృతమవుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక తాజాగా ఇజ్రాయెల్ లోని అమెరికన్ ఎంబసీ తమ పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది. అమెరికన్ ఎంబసీ ప్రస్తుతం ఇజ్రాయెల్ నుండి అమెరికన్లను ఖాళీ చేయించడానికి లేదా వారు అక్కడ నుండి నిష్క్రమించడానికి నేరుగా సహాయం చేసే స్థితిలో లేదని ఒక ప్రకటనలో పేర్కొంది. వారి కోసం కొన్ని కీలక సూచనలు చేసింది. ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ మార్చి 2 నుండి తాబా (Taba) సరిహద్దు దాటడానికి షటిల్ సర్వీసులను ప్రారంభించిందని తెలిపింది. అందులో ప్రయాణించాలనుకునే వారు తప్పనిసరిగా పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క ‘ఎవాక్యుయేషన్ ఫారమ్’ (evacuation form) ద్వారా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ షటిల్ సర్వీసులను ఉపయోగించుకోవాలని అమెరికా రాయబార కార్యాలయం ఎటువంటి సిఫార్సు చేయడం లేదని తెలిపింది. మీరు ఈ మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకుంటే, మీ భద్రతకు అమెరికా ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వదని పేర్కొంది. ఇజ్రాయెల్ నుండి వెళ్లాలనుకునే వారి సౌకర్యార్థం మాత్రమే ఈ సమాచారం అందించబడుతోందని స్పష్టం చేసింది. ఇక జోర్డాన్ కు వెళ్లాలనుకునే ప్రయాణీకులు ఈ షటిల్ ద్వారా ఇలాత్ (Eilat) వరకు వెళ్లి, అక్కడ నుండి స్వతంత్రంగా (టాక్సీ ద్వారా) ఇట్జక్ రబిన్ బోర్డర్ వరకు చేరుకోవచ్చని తెలిపింది.