తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా, ఏఐ మరియు మార్ఫింగ్ వీడియోల ద్వారా తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని బీ.ఆర్.నాయుడు స్పష్టం చేశారు. టీటీడీ ఛైర్మన్గా తనపై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. నిరాధార, దుష్ప్రచార కథనాలను ఇకపై ప్రసారం లేదా ప్రచారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇప్పటికే ప్రచురితమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా పేర్కొందని తెలిపారు. అలాగే గూగుల్, ట్విట్టర్ (X), ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్ఫార్మ్లకు సంబంధిత కంటెంట్ను డౌన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. సత్యం చివరకు గెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.