భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఆదరణ ఉన్న దేశాలలో భారత్ దే అగ్రస్థానం. ఇక తాజాగా జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ లో వీక్షకుల సంఖ్య రికార్డుస్థాయిలో నిలిచింది. భారతదేశంలో ఈ టోర్నీ వీక్షకుల సంఖ్య 500 మిలియన్లు (50 కోట్లు) దాటడం పట్ల ఐసీసీ ఛైర్మన్ జై షా హర్షం వ్యక్తం చేశారు. ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2026 ప్రయాణం, ఈ టోర్నీని చరిత్రలోనే అత్యంత గ్లోబల్ మరియు అందరికీ అందుబాటులో ఉండే క్రికెట్ ఈవెంట్గా మార్చాలనే లక్ష్యంతో ప్రారంభమైందని అన్నారు. భారతదేశంలో ఈ టోర్నీ వీక్షకుల సంఖ్య 500 మిలియన్లు (50 కోట్లు) దాటడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఏదైనా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. అలాగే,జియో హాట్ స్టార్ లో ఏకకాలంలో వీక్షించే వారి సంఖ్య (concurrent viewers) 60.5 మిలియన్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈరోజు నుండి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, భారతీయ అభిమానులు చూపే ఈ అపారమైన ప్రేమ మరిన్ని రికార్డులను తిరగరాస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.