పూర్తిగా డిజిటల్ విధానంలో తొలిసారి 16వ సెన్సెస్ చేపట్టనున్నారు. 2027 జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది మే 1వ తేదీ నుండి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియ చేపడుతున్నట్టు ఏపీ సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె. నివాస్ సీఎం చంద్రబాబుకు వివరించారు. క్యాంపు కార్యాలయంలో సీఎంతో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జనాభా లెక్కల ప్రక్రియను రెండు దశలుగా చేపడుతున్నామని తెలిపారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియను చేపట్టనున్నట్టు వివరించారు. మే 30 తేదీ వరకూ జరిగే ఈ ప్రక్రియలో ఇళ్లలోని పరిస్థితులు, గృహాల్లోని వివిధ సదుపాయాలను, ఆస్తులకు సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రాసెస్ లో భాగంగా ఏప్రిల్ 16 తేదీ నుండి 30 తేదీ వరకూ స్వీయ గణన వెసులుబాటు కల్పించినట్టు వివరించారు. రెండో దశలో భాగంగా 2027 ఫిబ్రవరి నుండి జనాభా లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. సెన్సస్ లో భాగంగా సామాజిక ఆర్ధిక, సాంస్కృతిక పరిస్థితులు, వలసలు, సంతానానికి సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నట్టు తెలిపారు.