మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత అంటూ ఆందోళన వ్యక్తమవుతున్న వేళ రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపి ఊరట కలిగించారు. హాస్పిటల్స్, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో గ్యాస్ సప్లై అంశంపై ఆర్టీజీఎస్ నుండి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు.