నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రాల వారిగా ఉన్న లోక్సభ స్థానాల నిష్పత్తిలోనే నియోజకవర్గాలను పెంచాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న స్థానాలకు 50 శాతం సీట్లు పెంచుతూ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే, జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండదని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నియోజకవర్గాల పునర్విభజన, మూసీ నది ప్రక్షాళన, తెలంగాణ విజన్ 2047, పరిపాలన, రాజకీయ స్థితిగతులపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో 50 శాతం మేరకు సీట్లను పెంచాలన్న నిర్ణయం ఏ ప్రాతిపదికన చేశారని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ వల్ల ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తొలుత అఖిల పక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం మేరకు మార్గదర్శకాలు రూపొందించాల్సిందని అన్నారు. అయితే ముందే నిర్ణయం తీసుకుని, తర్వాత అందరి అభిప్రాయాలు అడగడటం సమంజసం కాదన్నారు.