ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత జాబ్ మేళాను వినియోగించుకుంటున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. చంద్రబాబు గారి విజన్ ఫలాలు ఒక్కొక్కటిగా యువతకు అందుతున్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు.చంద్రబాబు ఇచ్చిన మాట తప్పరు. ఓట్ల కోసం హామీలు ఇవ్వరు. ప్రజల కోసం నిలబడతారని చెప్పారు. నిరుద్యోగ యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి జాబ్ మేళాలతో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. యువత కష్టపడి పనిచేస్తే మరిన్ని అవకాశాలు లభిస్తాయని పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల కలలను పిల్లలు నిజం చేసేలా ఆలోచించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను మంచి, చెడు మధ్య వ్యత్యాసాలు చెబుతూ పెంచాలన్నారు.