ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ రోజు చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా చేనేత మగ్గానికి 200 యూనిట్లు, పవర్ లూమ్ కి 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందజేయనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రయోజనం పొందబోతున్న ప్రతి చేనేత కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 93,000 చేనేత మగ్గాలు, 11,488 పవర్ లూమ్ యూనిట్లకు లబ్ది చేకూరనుంది. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా చిన్న చేనేత కుటుంబాలకు ఉత్పత్తి వ్యయం తగ్గి కొంత మేర ఉపశమనం లభించనుందన్నారు. 2017లో నేతన్నలు తనను కలసి వారి కష్టాలు చెప్పుకొన్నప్పుడు మనసు చలించిందిని పవన్ అన్నారు. వారికి నా వంతు అండగా నిలిచేందుకు నాకు నేనుగా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ముందుకు వచ్చాను. వారంలో ఒక రోజు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని నేనిచ్చిన పిలుపు యువతలో చైతన్యం నింపింది. నివార్ తుపాను కారణంగా వెంకటగిరి చేనేత మగ్గాలకు నష్టం జరిగినప్పుడు స్వయంగా వెళ్లి వారి కష్టాలు చూసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చాను. ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్న వేళ కూటమి భాగస్వామ్యపక్షంగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు. గడచిన 21 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుందన్న పవన్ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్తోందన్నారు.