పరిస్థితులకు అనుగుణంగా విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ తెలిపారు. విద్యావేత్త, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో స్థాపించిన ఏవీఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ సునామీలో దేశం ఎదుర్కోబోయే సమస్య ఎంత తీవ్రమైందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలోనూ విద్య అందుబాటులో ఉన్నప్పటికీ, నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాని ఎక్కడ విఫలమయ్యామో ప్రజా ప్రతినిధులు అందరూ ఆలోచన చేయాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన ఎక్కడో ఒకచోట అది ప్రారంభం కావాలన్నారు. వ్యవస్థను సాధికారం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం విద్యపైన ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తిని చూపుతోందని అందులో భాగంగానే 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఒక్కో పాఠశాలలో 2500 విద్యార్థులు చదువుకునేలా నిర్మాణాలు ప్రారంభించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం 1 లక్షా 8 వేల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. బడ్జెట్లో 8.3 శాతం నిధులు విద్యపైన ఖర్చు పెడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ప్రయోగాత్మకంగా 100 గవర్నమెంట్ స్కూల్స్ లో నర్సరీ నుండి 12వ తరగతి విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. 1.34 కోట్ల జనాభా కలిగిన హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా #CURE లో పాఠశాలలను రేషనలైజేషన్ చేసి ప్రయోగాత్మకంగా మోడల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ప్రైవేటు స్కూల్స్ సక్సెస్ కావడానికి నర్సరీ, ఎల్కేజీ వంటి విధానంతో పాటు రవాణా సౌకర్యం కూడా ఒక కారణమని అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. వీటికి తోడు బ్రేక్ ఫాస్ట్, లంచ్, అది కూడా మంచి పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ లో కూడా స్టూడెంట్స్ రాణించాలన్నారు. క్రీడల్లో రాణించిన వారిని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.