‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(RDT)’ వ్యవస్థాపకులు విసెంటే ఫెర్రర్ మోంచో జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన 25 లక్షల మంది పేదల పురోగతికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి మానవతా దృక్పథంతో సేవలందిస్తోన్న ‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(RDT)’ వ్యవస్థాపకులు విసెంటే ఫెర్రర్ మోంచో జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నని చంద్రబాబు పేర్కొన్నారు. స్పెయిన్ దేశం నుంచి వచ్చి సీమ ప్రజలకు ఎంతో మేలు చేసి వారికి ఆరాధ్యనీయుడైన విసెంటే స్ఫూర్తిని అందుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. పేద ప్రజలకు దేవుడిచ్చిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవాస్ఫూర్తికి మంత్రి నారా లోకేష్ జోహార్లు అర్పించారు. అర్ధ శతాబ్దం క్రితం తెలుగునేలపై అడుగుపెట్టి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆరంభించి, అనంత ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందారని కొనియాడారు. . తెలుగు రాష్ట్రాల్లో ఆసుపత్రులు, విద్యాలయాలు, స్వయంసహాయక సంఘాలు, క్రీడామైదానాలు, నిరుపేదలకు పక్కా గృహాల నిర్మాణంతో ప్రగతి ప్రదాతగా నిలిచారు. ఈ ఏడాది ఫాదర్ ఫెర్రర్ జయంతి కానుకగా ఆర్డీటీకి FCRA అనుమతిని సాధించి, ప్రజలకు నిరంతరాయంగా ఆర్డీటీ సేవలు అందేలా కృషి చేసినట్లు తెలిపారు. నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో చిరకాలం జీవించి ఉంటారన్నారు.