దేశ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతల మాటామంతి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. పార్లమెంట్ వద్ద ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వారిద్దరూ ఎవరో కాదు ఒకరు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాగా, మరొకరు లోక్ సభా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాజకీయంగా ఎప్పుడూ విమర్శలు, ప్రతి విమర్శలతో మీడియాలో నిలిచే వీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రశాంతంగా కనిపించడంతో సోషల్ మీడియాలో ఈ సన్నివేశం వైరల్ అవుతోంది. నేడు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి పలువురు కేంద్ర మంత్రులు పార్లమెంట్ ప్రాంగణంలోని ‘ప్రేరణ స్థల్’ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, జేపీ నడ్డా, రాహుల్ గాంధీతో మాట్లాడుతూ ప్రధాని ముందుకు వెళ్లారు. మళ్లీ తిరిగి వచ్చి రాహుల్ తో కొద్దిసేపు మాట్లాడారు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.