ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు ముందు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ 40 (32; 3×4, 2×6), ముకుల్ చౌదరి 39 (28; 3×4, 2×6), ఆయుష్ బడోని 38 (24; 4×4, 1×6) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. నికోలస్ పూరన్ (1), రిషబ్ పంత్ (1), అబ్దుల్ సమద్ (0) ఘోరంగా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో రసిక్ సలామ్ దార్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు, కృనాల్ పాండ్య 2 వికెట్లు, జోష్ హాజల్ వుడ్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 49 (34; 6×4, 1×6), రజత్ పటేదార్ (27), జితేష్ శర్మ (23) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, ఆవేష్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.