కేంద్రం ప్రతిపాదించిన 2011 జనాభా లెక్కల ఆధారిత డీ లిమిటేషన్ ప్రక్రియ రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె లేఖ రాశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ మరియు ఆర్థిక భవిష్యత్తుకు పెను ముప్పు అని పేర్కొన్నారు. అత్యంత ఆందోళనతో, ఒక అత్యవసర పరిస్థితిగా గుర్తిస్తూ, నియోజకవర్గాల పునర్విభజనపై ఈ 3 పేజీల బహిరంగ లేఖను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తన స్వరం మాత్రమే కాదు, వేల కోట్ల రూపాయల భవిష్యత్ ఆర్థిక అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు తీవ్రంగా అన్యాయం చేసే ఈ ప్రతిపాదిత డీలిమిటేషన్కు బహిరంగంగా, స్పష్టంగా వ్యతిరేకత తెలియజేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 లోక్సభ సభ్యులు మరియు 11 రాజ్యసభ సభ్యులు అందరినీ, పార్టీ భేదాలు లేకుండా ఏకతాటిపైకి తీసుకువచ్చి, పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా ప్రోత్సహించాలన్నారు. అత్యవసరంగా ఒకరోజు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ కీలక అంశంపై చర్చించి, ప్రతిపాదిత డీలిమిటేషన్ ఫ్రేమ్వర్క్ను తిరస్కరించే తీర్మానం ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపించాలన్నారు. ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే కారాదని ఇది ప్రజల హక్కులను కాపాడే రాజ్యాంగ బాధ్యతగా, భావితరాల భవితను గుర్తుపెట్టుకుని వేసే అడుగని పేర్కొన్నారు.