కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటకకు చెందిన భక్తుల వాహనం మంత్రాలయం దర్శనానికి వస్తుండగా తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయైనట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు. మంత్రాలయం క్షేత్రం దర్శనం కోసం విచ్చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుని బాధిత కుటుంబాలకు తగిన సహాయం చేయాలని సూచించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామన్నారు. అలాగే ప్రమాదంలో గాయపడిన 13 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మరణాల సంఖ్య పెరగకుండా చూడాలని, మృతుల కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.