ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఆ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు తాజాగా లీగల్ నోటీసులు జారీ అయ్యాయి.టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తరఫు న్యాయవాది ఈ నోటీసులను పంపారు. ఇటీవల ప్రకాశ్ రాజ్ హిందువులకు పవిత్రమైన, ఆరాధ్య దైవమైన రామలక్ష్మణులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని, అవి కోట్లాది మంది భక్తుల మనోభావాలను బాధించాయని నోటీసులో పేర్కొన్నారు. తమ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్ణీత సమయంలోగా స్పందించకపోయినా లేదా క్షమాపణలు చెప్పకపోయినా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేయనున్నట్లు హెచ్చరించారు.