ఇండియన్స్ ఉమెన్స్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సరికొత్త రికార్డును నెలకొల్పి సత్తా చాటింది. ఈ క్రమంలో భారత మెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆమె దాటేసింది. సౌతాఫ్రికాతో డర్బన్లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో ఆమె ఈ అరుదైన ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్మృతి మంధాన, రోహిత్ శర్మ ఇద్దరూ 4,231 పరుగులతో సమంగా ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్ సునే లూస్ వేసిన బంతికి సింగిల్ తీసి స్మృతీ మంధాన, రోహిత్ రికార్డును అధిగమించింది. ఈ మ్యాచ్లో ఒక సిక్సర్తో కలిపి 13 పరుగులు చేసి ఔటైంది. ఇక ఈ రికార్డుతో స్మృతి మంధాన 161 టీ20 మ్యాచ్ లలో 30 పైచిలుకు యావరేజ్ తో 4,244 రన్స్ పూర్తి చేసింది. ఆమె కెరీర్ లో ఒక సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రోహిత్ శర్మ 159 మ్యాచ్ల్లో 5 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలతో 4,231 పరుగులు చేశాడు.2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీ 20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భారత టీ20 క్రికెట్ లో రన్ మెషీన్ గా స్మృతి మంధాన ప్రస్తుతానికి టాప్ లో కొనసాగుతోంది.