గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు కరువవుతోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా, ఉపాధి హామీ పథకం (MGNREGA) సమర్థవంతమైన అమలు అత్యంత కీలకమని ఆయన ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దగ్గర ఉండే ఆదాయాన్ని పెంచుతుంది. ఖర్చు చేసే శక్తి ఎక్కువగా ఉండే ఈ వర్గాల ఆదాయం పెరగడం వల్ల గ్రామీణ వినియోగం మెరుగుపడుతుందన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే రాష్ట్రాలలో ఒకటిగా ఉండేదని అయితే గత రెండేళ్ల టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో, ఈ విషయంలో రాష్ట్రం వెనుకబడటం చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమోదించబడిన లేబర్ బడ్జెట్, పని చేసిన మొత్తం గృహాల సంఖ్య మరియు వ్యయం వంటి దాదాపు అన్ని పారామీటర్లలో గత రెండేళ్లుగా పనితీరు తగ్గిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గత రెండేళ్లలో జీఎస్టీ (GST) మరియు అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండటం కూడా దీనికి నిదర్శనమని ఇది ప్రజల కొనుగోలు శక్తి తగ్గడాన్ని, ఫలితంగా డిమాండ్ క్షీణించడాన్ని స్పష్టంగా సూచిస్తోందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అవినీతిపై ఉన్న అమితమైన వ్యామోహంతో సంపదను కూడబెట్టుకోవడంలోనే నిమగ్నమై ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే తీరిక ఆ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.