మధ్య ప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరణ కోసం మరోసారి చర్చలు జరిపేందుకు ఇరు వర్గాలు రెడీ అవుతున్నాయి. తాజాగా అమెరికాతో శాంతి చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ గత రాత్రి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కు చేరుకున్నారు. అరాగ్చీ పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ తో సమావేశమయ్యారు. ఆయనకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్, పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ , పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సీన్ నఖ్వీ స్వాగతించారు. ఈరోజు మునీర్ తో అరాఘ్చీ టీమ్ భేటీ జరిగింది. మరోవైపు, చర్చల కోసం అమెరికా ప్రతినిధుల బృందం కూడా పాకిస్థాన్ పయనమయ్యారు. అయితే అమెరికా ప్రతినిధులతో నేరుగా సమావేశం ఉండబోదని ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అబ్బాస్ అరాఘ్చీ పాకిస్థాన్ ప్రతినిధులతో సమావేశమై ఇరాన్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు తదితర అంశాలపై అలాగే అమెరికాతో ఉద్రిక్తతలకు సంబంధించిన అంశంపై పాకిస్థాన్ ప్రతినిధులతో చర్చించనున్నారు.