ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రం-1 ఆర్బిటల్ రాకెట్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నుండి అంతరిక్షం పేరుతో స్కైరూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు సంస్థ ప్రతినిధుల సమక్షంలో సీఎం రేవంత్ విక్రం-1 రాకెట్ను ప్రారంభించారు. ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్న తెలంగాణ లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయి అని అన్నారు. జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో ఈ రాకెట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ SDSC అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగశాలకు తరలిస్తారు.హైదరాబాద్ మామిడిపల్లిలోని జీఎంఆర్ ఏరోస్పేస్ – ఇండస్ట్రియల్ పార్క్లో నెలకొల్పిన స్కైరూట్ కు చెందిన మాక్స్-క్యూ డిజైన్ ఫెసిలిటీలో విక్రం-1 రాకెట్ను రూపొందించారు. దేశ అంతరిక్ష పరిశోధనలో ప్రైవేటు రంగంలో రూపొందించి అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ ఇదే. ఈ రాకెట్ను పూర్తిగా హైదరాబాద్లోనే రూపొందించి, అభివృద్ధి చేయడం ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా స్కైరూట్ బృందాన్ని సీఎం రేవంత్ అభినందించారు. స్కైరూట్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై విక్రం-1 ఆర్బిటల్ రాకెట్ వివరాలను తెలుసుకుని వారితో మాట్లాడారు. అనంతరం స్కైరూట్ ఫెసిలిటీ సెంటర్ పరిశీలించారు. శాటిలైట్ లను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ ను స్కైరూట్ డెవలప్ చేసింది. సంస్థ 2022లో తన తొలి రాకెట్ను ప్రయోగించగా, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవడం కీలక విజయమని సీఎం అభినందించారు. ఏరోస్పేస్ రంగంలో దేశంలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉందని, బోయింగ్, ఎయిర్బస్, సాఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే తెలంగాణాలో ఉన్నాయని అన్నారు. ఏరోస్పేస్ రంగంలో 2047 నాటికి ప్రపంచ అగ్రగామిగా నిలవడమే తెలంగాణ లక్ష్యమని పేర్కొన్నారు.