ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు మూడున్నర గంటలపాటు ఈ భేటీ జరిగింది. దాదాపు 20కిపైగా అజెండా అంశాలకు ఈ భేటీలో ఆమోదం తెలిపింది. ఈ సమావేశ వివరాలను మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు తెలిపారు. . ఢిల్లీలో 11.5 ఎకరాల్లో రూ.124.50 కోట్లతో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, రెంట్ నిర్ణయ విధానాల సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. . రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యుటేషన్ చార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్టసవరణ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రామాయపట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.354 కోట్ల పాలనా అనుమతులను ఆమోదించింది. ఏపీ మార్క్ ఫెడ్ కు రూ.1800 కోట్ల లోన్ పొందేందుకు గవర్నమెంటు గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ.1,208 కోట్ల వ్యయానికి ఓకే చెప్పింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్ కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్స్ కు ఆమోదం తెలిపింది. హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో 21 కొత్త నియామకాలకు ఆమోదించింది. ఇక కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసీపీ చేస్తున్న విమర్శలను ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు ధీటుగా తిప్పికొట్టాలన్నారు. మంత్రుల సింగపూర్ పర్యటన, రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగ ఎదుర్కోవాలని సూచించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మిస్తున్న అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాల విశిష్టతను ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. అలాగే ఇటీవల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు.