వారణాసిలో  మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్..!

Spread the love

ప్రస్తుతం భారతీయ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి. తన విజన్ తో ఇప్పటికే భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుత ఫేమ్ తీసుకొచ్చిన రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ దశలో ఉన్న ‘వారణాసి’ కొత్త షెడ్యూల్‌ను రాజమౌళి టీమ్‌ చాలా భారీగా ప్లాన్‌ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్‌లో ఒక భారీ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్‌ను తెరకెక్కించబోతున్నారట. ఇప్పటివరకు భారతీయ  సినిమాలో ఎవరూ ప్రయత్నించని స్థాయిలో ఈ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ యాక్షన్‌ షెడ్యూల్‌ దాదాపు నెల రోజుల పాటు నాన్‌స్టాప్‌గా సాగనున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి ఇప్పటికే హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో కలిసి ఈ సీక్వెన్స్‌కు ప్రత్యేక ప్లానింగ్‌ చేస్తున్నారట. అడవి నేపథ్యంలో జరిగే ఈ యాక్షన్‌ భాగం సినిమాలోనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. కేవలం ఫైట్స్‌కే పరిమితం కాకుండా… కథలో భావోద్వేగాలు, మైథాలజీ టచ్‌, సైన్స్‌ ఫిక్షన్‌ ఎలిమెంట్స్‌ అన్నీ కలిపి ఈ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేస్తున్నట్టు సమాచారం. రాజమౌళి సినిమాల్లో యాక్షన్‌కు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాల్లో ఆయన తెరకెక్కించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు ‘వారణాసి’తో ఆ స్థాయిని కూడా మించి వెళ్లాలని జక్కన్న ప్లాన్‌ చేస్తున్నారట. ముఖ్యంగా ఈ సినిమా కోసం మహేశ్‌బాబు కూడా చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫిజిక్‌, లుక్‌, యాక్షన్‌ ట్రైనింగ్‌ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నాడట. మహేశ్‌ను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త అవతార్‌లో ఈ సినిమాలో చూపించబోతున్నారని టాక్‌. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. మలయాళ  స్టార్‌ నటుడు పృథ్విరాజ్‌ సుకుమారన్‌ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మాధవన్‌, ప్రకాశ్‌రాజ్‌ వంటి ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఒక్కో పాత్రకూ కథలో చాలా బలమైన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కథ గురించి అధికారిక వివరాలు బయటకు రాకపోయినా.. ఇది భారతీయ పురాణాలు, ఆధునిక సైన్స్‌, అడ్వెంచర్‌ అంశాల మేళవింపుతో రూపొందుతున్నట్టు సమాచారం. వారణాసి నగరం చుట్టూ తిరిగే మిస్టరీ, పురాణాల వెనక దాగి ఉన్న రహస్యాలు, కాలానికి అతీతమైన శక్తులు వంటి ఆసక్తికర అంశాలతో కథ ముందుకు సాగుతుందట. అందుకే ఈ సినిమాపై కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ కలిసి నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి-కీరవాణి కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి సినిమాల్లో ఆయన ఇచ్చిన సంగీతం ఎంతటి మాయ చేసిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ యాక్షన్‌ షెడ్యూల్‌ వార్తతో మహేశ్‌బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి  తీస్తున్న సినిమా కావడంతో అందరి అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరి ఈ భారీ ప్రాజెక్ట్‌తో రాజమౌళి ఇంకెన్ని కొత్త సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *