పశ్చిమాన పాకిస్తాన్ ను వాడుకుంటున్న చైనా.. ఇప్పుడు తూర్పున ఉన్న బంగ్లాదేశ్ను తన వైపుకు తిప్పుకుంటోంది. తాజాగా 20 జే-10 సీఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్ సిద్ధమైంది. అక్షరాలా 2.3 బిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు 19 వేల కోట్ల రూపాయల భారీ రక్షణ ఒప్పందం ఇది. బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్ తమ దళాన్ని పూర్తిగా ఆధునీకీకరించుకోవడంపై పూర్తి స్థాయి దృష్టి పెట్టింది. దశాబ్దాల కాలం నాటి పాత తరానికి చెందిన మిగ్ , ఎఫ్-7 యుద్ధ విమానాలను ఫేజ్ అవుట్ చేసి, వాటి స్థానంలో అడ్వాన్స్డ్ మల్టీ రోల్ ఫైటర్ జెట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చైనా నుంచి ఏకంగా 20 J-10CE యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. దీని కోసం రెండు దేశాల మధ్య చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.ప్రపంచంలో ఎన్నో దేశాలు అద్భుతమైన ఫైటర్ జెట్స్ ఇస్తామన్నా సరే.. బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగానే చైనా వైపు మొగ్గు చూపడం వెనుక ఏమైనా కారణాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు చెందిన చెంగ్డూ ఏరోస్పేస్ కార్పొరేషన్ తయారు చేసిన 20 , J-10CE విమానాలను కొనుగోలు చేయడానికి బేరాలు సాగుతున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే.. బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్ చరిత్రలోనే ఇదొక అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలిచిపోతుంది. అయితే, ఈ ఆయుధ విక్రయాల వెనుక బంగ్లాదేశ్ మైండ్ వాష్ చేయడానికి పాకిస్తాన్ స్వయంగా రంగంలోకి దిగి తన నక్క బుద్దిని చూపించిందనే వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు మనకు స్నేహపూర్వకంగా ఉన్న బంగ్లాదేశ్, ఇప్పుడు ఇలా చైనా ఆయుధాల వైపు పూర్తిగా మొగ్గు చూపడం ఆందోళన కలిగించే విషయంగా మారింది. గతేడాది పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇరు దేశాల వాయుసేనల మధ్య భీకర ఘర్షణ జరిగింది. అప్పుడు పాకిస్తాన్ ఈ చైనీస్ జే-10 విమానాలనే ఉపయోగించింది. అయితే ఆ ఘర్షణ ముగిసిన తర్వాత పాకిస్తాన్, చైనా మీడియా ఒక భారీ ఫేక్ ప్రచారానికి తెరతీశాయి. మా జే-10 విమానాలు అత్యంత కచ్చితత్వంతో భారత యుద్ధ విమానాలను లాక్ చేశాయి , డాగ్ ఫైట్లో అదరగొట్టాయి అంటూ ఒక ఫేక్ నేరేటివ్ సెట్ చేశాయి. అప్పట్లో దీనిపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పాక్ వాదనలు పచ్చి అబద్ధాలని, ఒక్క రుజువు కూడా వారు ప్రపంచానికి చూపించలేకపోయారని భారత్ తీవ్రంగా ఖండించింది. వాస్తవానికి ఇండియన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దెబ్బకు పాక్ జెట్లు వెనుదిరిగాయి. కానీ, ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మిన బంగ్లాదేశ్.. ఆ విమానాలు నిజంగానే అత్యంత శక్తివంతమైనవి అని భ్రమపడి ఇప్పుడు ఈ డీల్కు ఓకే చెప్పింది. మన భారతీయ తేజస్, లేదా రాఫెల్ విమానాలతో పోలిస్తే ఆ జెట్లు ఏమాత్రం సాటిరావు అని డిఫెన్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ, మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్ , బంగ్లాదేశ్ రెండు వైపుల నుంచి ఒకే రకమైన యుద్ధ విమానాలు మోహరిస్తే.. అది భవిష్యత్తులో యుద్ధ వ్యూహాల పరంగా మన సైన్యానికి కొంచెం సవాలుతో కూడుకున్నది అవుతుంది. పాకిస్తాన్, చైనా కలిసి ఆడిన ఈ మైండ్ గేమ్లో బంగ్లాదేశ్ పూర్తిగా బలైపోయిందా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఇది కేవలం బంగ్లాదేశ్కు 20 విమానాలు అమ్మే వ్యాపారం మాత్రమే కాదు.. దక్షిణాసియాలో ఇండియాను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే డ్రాగన్ ఆలోచనా అనేది చూడాల్సి ఉంది. ఇండియాకు తూర్పు వైపున కూడా చైనా పరోక్షంగా తన బేస్ను స్ట్రాంగ్ చేసుకుంటోందా దీనివల్ల రేపు ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే, భారత్ టూ-ఫ్రంట్ లేదా త్రీ-ఫ్రంట్ వార్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నది డిఫెన్స్ నిపుణుల హెచ్చరిక.మన ఇరుగుపొరుగు దేశాలు ఇలా డ్రాగన్ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోవడం ఇండియాకు ఏమాత్రం మంచిది కాదు. కౌంటర్గా ఇండియా తన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని మరింత అగ్రెసివ్గా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనా ఆడుతున్న ఈ మైండ్ గేమ్ను తిప్పికొట్టడానికి భారత్ కూడా దౌత్యపరంగా, సైనికంగా గట్టిగానే బదులిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.