ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్ పై క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల సమర్థత పెరిగేలా, మెరుగైన సేవలు అందించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ నెల నుంచి కనీసం 80 శాతం నుంచి 90 శాతం తగ్గకుండా పబ్లిక్ పర్షెప్సన్ ఉండాలని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీ, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు బాగున్నాయి. అయితే పుంగనూరు, వెంకటగిరి, పెనుకొండ, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, శ్రీకాళహస్తి బస్ స్టేషన్లో తాగునీరు, టాయిలెట్స్, ఫ్యాన్స్, సీటింగ్ ఏరియాపై ప్యాసెంజర్స్ నుండి అసంతృప్తి ఉందని సీఎం చెప్పారు. అందుకే మొత్తం రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో టాయిలెట్లు రిపేర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సర్వీసెస్, స్టాఫ్ బిహేవియర్ పై సంతృప్తి వ్యక్తమైందని, అవినీతికి తావులేకుండా రాష్ట్రంలోని మొత్తం 295 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నిజాయితీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వాట్సప్ మనమిత్ర సర్వీసెస్ ఉపయోగించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని, వందకు వంద శాతం వాట్సప్ సేవల వినియోగం జరగాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.