ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే దిశగా ప్రభుత్వం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ అంశంపై ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల స్పందించారు. అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం హర్షణీయమేనని సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమేనని పేర్కొన్నారు. మళ్లీ ఏ జగన్ గారు లాంటోళ్లు వస్తే..అని ముందుచూపు ఉండడం మీ విజన్ కి నిదర్శనం అనుకుందాం. మరి రాజధాని కోసం విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 94(3) సంగతేంటి అని ప్రశ్నించారు. సెక్షన్ 5 ( సబ్ సెక్షన్ 2) లో ఎట్ అమరావతి పదాన్ని పెట్టించేందుకు ఉన్న శ్రద్ధ.. సెక్షన్ 94(3) కింద అమరావతి ఫండ్స్ అడిగేందుకు లేదా ? గెజిట్ తోనే అమరావతి గెయిన్ అవుతుందా ? ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ భాద్యత కేంద్రానిదే అని తెలియదా ? అని ప్రశ్నించారు. ఎంతైతే అంత కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే అనే క్లాజ్ సెక్షన్ 94(3d) చదవలేదా ? అని షర్మిల నిలదీశారు. కేంద్రం చేస్తున్న మోసంపై వద్దా అసెంబ్లీ తీర్మానం ? నిధులు హక్కుగా ఇవ్వాల్సిందేనని తీర్మానం చేయొద్దా? విభజన చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తుంటే అసెంబ్లీ వేదికగా తీర్మానం వద్దా? మోడీ గారిచ్చిన చెంబుడు నీళ్లు,తట్టెడు మట్టితో సరిపెట్టుకుందామా ? అని దుయ్యబట్టారు. ఇదే బీజేపీ రాజధానికి ఇచ్చిన గొప్ప ప్రసాదంగా భావిద్దామా ? అసలొద్దు.. అప్పులిప్పిస్తే చాలని రాజీపడదామా? అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ప్రశ్నలు కురిపించారు. అమరావతికి నిర్మాణానికి పట్టే రూ.1 లక్ష కోట్లు ప్రజల నెత్తిమీద వేద్దామా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సంధిస్తున్న ప్రశ్నలపై కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.