ఈరోజు తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని లోకేష్ ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. దాదాపు 250 క్యూసెక్కుల నీటి విడుదల చేయగలిగిన ఈ పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభించనుంది. నీటిని ఎత్తిపోసేందుకు నాలుగు పంపులను అమర్చారు. ఎన్నికల హామీల్లో భాగంగా మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పూర్తిచేయించారు. ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన మరో కీలక హామీని మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. భవిష్యత్లో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పట్టిష్టమైన డిజైన్తో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తైతే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50వేల మంది ప్రజలకు వరద భయం ఉండదు.