నేడు శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు. ఆయన అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు మనం శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటాం. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన. అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలని, మీకు మీ కుటుంబానికి ఆ శ్రీరాముడి కృపాకటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ప్రతీ ఒక్కరిపై శ్రీరామచంద్రుని కృపా,కటాక్షాలు ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తూ, ప్రజలందరికీ శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మంత్రి నారా లోకేష్:
ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. సుపరిపాలనకు శాశ్వత నమూనా రామరాజ్యం. లోకకళ్యాణం కోసం సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగాలని ప్రార్థిస్తున్నాను. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు.

మాజీ సీఎం వై.ఎస్.జగన్:
ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీ.వీ.ఎన్ మాధవ్:
ధర్మసంస్థాపనకు సంకల్పబద్ధుడైన శ్రీరాముడి ఆశీస్సులతో రాష్టమంతటా ఐక్యత, శ్రేయస్సు వర్ధిల్లాలి. శ్రీరాముడి సత్యనిష్ఠ, కర్తవ్యబద్ధత, ధర్మపాలన మన జీవితాల్లో ఆచరణీయంగా మారాలి.
రాష్ట్ర ప్రజలందరకూ శ్రీరామనవమి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల:
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. సీతారాముల ఆశీస్సులు ఎల్లవేళలా రాష్ట్ర ప్రజలపై ఉండాలని, ఈ పర్వదినం మీ ఇంట సుఖసంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు వెళ్లి విరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.