ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతీ రంగంలో, ప్రతీ ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకమైన ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ రాకతో గొప్ప ముందడుగు వేశామని పేర్కొన్నారు. భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్కు అడుగులు పడిన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 21 నెలల క్రితం కబ్జాలు, కూల్చివేతలు, కేసులతో అభద్రత, భయం, మానసిక క్షోభతో అల్లాడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో నేడు అభివృద్ది, అవకాశాలు, ఆకాంక్షలతో అన్ని చోట్లా ఆనందాన్ని, భవిష్యత్ పై భరోసాను తీసుకువచ్చామని చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తే అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఉత్తరాంధ్ర భవిష్యత్కు నూతన దిక్సూచి అవుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏర్పాటు అవుతున్న ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్రాగా మారుస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉక్కు రంగంలో ఏపీ దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లనే 21 నెలల్లో ఇంత పెద్ద ప్లాంట్ను రాష్ట్రానికి తీసుకురాగలిగాం. ప్లాంట్కు అవసరమైన ముడి ఖనిజం సరఫరా నుంచి అనుమతుల వరకు కేంద్రం వేగవంతమైన, సానుకూల నిర్ణయాలతో ప్రతి దశలోనూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు నిర్ణయాల వల్లనే ఈ ప్రాంతంలో ఒక స్టీల్ సిటీ నిర్మితమవుతోందన్నారు. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రానున్న మూడేళ్లలోనే ఈ ప్రాంతంలో అన్ని రంగాల్లో, అన్ని విధాలా అభివృద్ది ఫలాలు అందుతాయన్నారు.