జాతీయస్థాయి అవార్డులు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని బలంగా విశ్వసించే ప్రభుత్వంగా పల్లెల్లో వెలుగులు నింపుతున్నామని సీఎం ఈ సందర్భంగా అన్నారు. సుపరిపాలన, పేదరిక నిర్మూలన – జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, ఉత్తమ మండలం, మహిళా స్నేహపూర్వక పంచాయతీ వంటి ఐదు అంశాల్లో వచ్చిన అవార్డులు 21 నెలల సుపరిపాలనను ప్రతిబింబిస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. అత్యుత్తమ విధానాలు, సంస్కరణలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ముందుకు నడిపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ శాఖ అధికారులకు, ఉద్యోగులకు సీఎం అభినందనలు తెలిపారు. గ్రామ స్వరాజ్య స్థాపనలో మరెన్నో విజయాలు అందుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.