అంబేద్కర్ కోనసీమజిల్లాలో రాత్రి వేళల్లో ఇండ్ల తలుపులకు వేసిన తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిబ్రవరి 14, 2026న ఆలమూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 22/2026 331(4), 305 బీఎన్ఎస్ కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో కండ్రె రాజు అలియాస్ చిన్న (22), సన్నపు వెంకట రమణ అలియాస్ వెంకన్న (20), ఉండ్రి ఆనంద్ కుమార్ (22) అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 203.650 గ్రాముల బంగారు ఆభరణాలు, 765 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల మొత్తం విలువ సుమారు రూ.32 లక్షల 40 వేలుగా పోలీసులు తెలిపారు.