దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో ట్రేడింగ్ ముగించి హ్యాట్రిక్ కొట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 633 పాయింట్లు లాభపడి 76,704 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో 23,777 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.92.74గా కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర స్వల్పంగా తగ్గడం మన మార్కెట్ కు సానుకూల అంశంగా మారింది. ఆసియా మార్కెట్లు బలంగా పుంజుకోవడంతో మన దేశీయ మార్కెట్లకు మద్దతు లభించింది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రాణించడం గమనార్హం.