ప్రముఖ సినీ దర్శకుడు బాబీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ విషయాన్ని బాబీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం… ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు…ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు…రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం… కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు. అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయానట్లు తెలిపారు. చివరగా ఒక్క మాట చెబుతున్నాను…జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం…జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను…జైహింద్ అంటూ బాబీ తన పోస్ట్ లో భావోద్వేగంగా స్పందించారు. ఇక పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను బాబీ తెరకెక్కించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆయన సినిమా చేస్తున్నారు. ఇదివరకు మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.