మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా చిత్రీకరణ మరో 6 రోజుల్లో పూర్తవుతుందని డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా తెలిపారు. రామ్ చరణ్తో సెట్స్లో దిగిన సెల్ఫీని షేర్ చేశారు. “నాకు అత్యంత స్ఫూర్తినిచ్చిన పాత్ర.. నేను ప్రేమించే పెద్ది” అంటూ బుచ్చిబాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు. భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ‘పెద్ది’ అనే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పహిల్వాన్ గా ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, పోస్టర్లలో ఆయన లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. ఆయన సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు సోషల్ మీడియాలో భారీ వ్యూస్ తో సత్తా చాటుతున్నాయి. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ముందుగా ఏప్రిల్ లో విడుదల చేయాలని భావించినప్పటికీ ప్రేక్షకులకు మరింత మంచి అవుట్ పుట్ అందించే ఉద్దేశంతో కొంత సమయం తీసుకున్నారు. దీంతో ఈ సినిమాను 2026 జూన్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.