గత రాత్రి కాబూల్ లోని ఒమిడ్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్ పై పాకిస్తాన్ జరిపిన అమానవీయ వైమానిక దాడిని భారత్ ఖండించింది. ఈమేరకు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది అత్యంత పిరికిపంద చర్యగా భారత్ పేర్కొంది. ఈ కేంద్రంపై జరిగిన దాడిలో అనేకమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒక మారణకాండను సైనిక చర్యగా చిత్రీకరించడానికి పాకిస్తాన్ ప్రస్తుతం ప్రయత్నిస్తోందని విమర్శించింది. పాకిస్తాన్ చేసిన ఈ ఘోరమైన దుశ్చర్య ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వానికి ప్రత్యక్ష ముప్పుగా పరిణమించిందని ఇది పాకిస్తాన్ యొక్క నిరంతర నిర్లక్ష్య వైఖరిని మరియు తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పొరుగు దేశాలపై హింసను ప్రేరేపించే ప్రయత్నాలను ప్రతిబింబిస్తోందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు శాంతి, ఆత్మపరిశీలన మరియు కరుణతో జరుపుకునే పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడి జరగడం అత్యంత గర్హనీయమని పేర్కొంది. ఒక ఆసుపత్రిని మరియు అక్కడి రోగులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకోవడాన్ని ఏ మతం, ఏ చట్టం లేదా ఏ నైతికత సమర్థించదని అంతర్జాతీయ సమాజం ఈ నేరపూరిత చర్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని మరియు ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై పాకిస్తాన్ జరుపుతున్న ఇటువంటి దాడులను తక్షణమే నిలిపివేసేలా చూడాలని కోరింది. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు భారతదేశం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తోంది మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ యొక్క సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు భారత్ తన మద్దతును పునరుద్ఘాటించింది.