దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కారుణ్య మరణానికి సంబంధించి ఒక కేసులో సంచలన తీర్పును ఇచ్చింది. దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి అచేతనంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం పై కీలక తీర్పును ఇచ్చింది. రాణాకు ట్రీట్మెంట్ నిలిపివేయొచ్చని పేర్కొన్న కోర్టు అతడికి కారుణ్య మరణానికి పర్మిషన్ ఇచ్చింది. కుమారుడికి కారుణ్య మరణం ఇవ్వాలని హరీశ్ పేరెంట్స్ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వెలువరించింది. ఇలా దేశంలో ఓ వ్యక్తికి కారుణ్య మరణం ప్రసాదించడం ఇదే మొదటి సారి. వివరాల్లోకి వెళితే ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో యాక్సిడెంట్ కు గురయ్యాడు. 4వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. అతని బాడీ అచేతన స్థితికి చేరుకుంది. ప్రముఖ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అందించినా, అతని ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అప్పటినుంచి అతడు కోమాలోనే ఉన్నాడు. అతడి తల్లిదండ్రులు అప్పటి నుండి ఇంట్లోనే ఉంచి హరీశ్ ను చూసుకుంటున్నారు. కుమారుడి ట్రీట్మెంట్ కోసం ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన ఆ తల్లిదండ్రులు అతడి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024లోఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ ను ఆ కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశ తప్పలేదు. అయితే, హరీశ్ కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు మరోసారి రిపోర్ట్స్ ఇవ్వడంతో అతడి కుటుంబం మళ్లీ సుప్రీంను ఆశ్రయించింది. మెడికల్ రిపోర్ట్ల ను పరిశీలించిన కోర్టు హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ ఏడాది జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తాజాగా కారుణ్య మరణానికి కోర్టు అనుమతి ఇచ్చింది.