ప్రధాని మోడీ అస్సాంలోని సిల్చార్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈరోజు భూమి పూజ జరుపుకున్న షిల్లాంగ్-సిల్చర్ హై-స్పీడ్ కారిడార్, సిల్చర్ను మిజోరం, మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. దీనివల్ల అస్సాంతో పాటు మొత్తం ఈశాన్య భారత రైతు సోదర సోదరీమణులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో ఎన్డీయే ప్రభుత్వ కృషి వల్ల అస్సాంలో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి సంబంధించిన పర్యావరణ వ్యవస్థ తయారవుతోందన్నారు. దీనితో పాటు, ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ నెట్వర్క్ బలోపేతం కావడంతో యువతకు సరికొత్త అవకాశాల ఆకాశం తలుపులు తెరుచుకుందని చెప్పారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో ఓటములలో సెంచరీ కొట్టబోతోంది. ఆ నిరాశలోనే ఇప్పుడు వారు దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు దిగజారుతున్నారు. అందుకే అస్సాం సోదర సోదరీమణులు, ముఖ్యంగా యువత చాలా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సిల్చర్ లో అశేష సంఖ్యలో తరలివచ్చిన నా అస్సాం కుటుంబ సభ్యుల ఉత్సాహం చూస్తుంటే, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై వారికి ఉన్న అచంచలమైన విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోందని మోడీ అన్నారు.