ప్రస్తుత ప్రపంచం ఒక అస్థిరమైన దశలోకి ప్రవేశించిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ముందుముందు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ చేశారు. భారతదేశ చమురు సరఫరా ముప్పులో ఉంది, మన దిగుమతుల్లో 40% కంటే ఎక్కువ ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (Strait of Hormuz) గుండానే సాగుతున్నాయి. ఎల్పిజి (LPG) మరియు ఎల్ఎన్జి (LNG) పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక మునిగిపోవడంతో, ఈ యుద్ధం మన ముంగిటకే చేరుకుంది. అయినప్పటికీ, ప్రధానమంత్రి మాత్రం నోరు మెదపడం లేదని విమర్శలు గుప్పించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో, దేశాన్ని నడిపించడానికి నిలకడైన నాయకత్వం అవసరం. కానీ అందుకు విరుద్ధంగా, మన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టిన ఒక అసమర్థ ప్రధానమంత్రి భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.