హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ శివరాంపల్లిలో హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు అద్భుతమైన సంస్కృతిని అందించడానికి బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు తెలిపారు. హైదరాబాద్లో చెరువులను పునరుద్ధరించిన ప్రాంతాల్లో నైట్ ఎకానమీ కొనసాగే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పౌరులకు మంచి వాతావరణం కల్పించినట్లు వివరించారు. ఇక్కడ మహిళలు స్వేచ్ఛగా ఉదయం, సాయంత్రం సమయాల్లో వాకింగ్ చేసుకోవడానికి ఇక్కడ లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. . అలాగే, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ లేక్స్ వద్ద స్టాల్స్ పెట్టి స్థానికులు పాలు, పండ్లు, కూరగాయలు పరిశుభ్రమైన వాతావరణంలో అమ్ముకోవడానికి వీలు కల్పిస్తామన్నారు. 99 రోజుల ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్ రాక్స్, లేక్స్ తో ప్రపంచంలోనే సుందరమైన నగరంగా ఉండింది. ఈ నగరం మనది. దీన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా అందరిపైన ఉందని పేర్కొన్నారు. ఈ మహానగరానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలను తొలగించే కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.