డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఈనెల 28న ఆరంభం కానున్న ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ సొంతగడ్డపై ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ సీజన్ లో బెంగళూరులో 5, రాయ్ పూర్ లో రెండు మ్యాచ్లు ఆడనున్నట్లు ఫ్రాంచైజీ తాజాగా ప్రకటించింది. గతేడాది టైటిల్ గెలిచిన తర్వాత జరిగిన విషాద ఘటన నేపథ్యంలో బెంగళూరులో మ్యాచ్ ల నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్ కు దీంతో తెరపడింది. 2025 ఐపీఎల్ లో ఆర్సీబీ మొదటి సారి టైటిల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో నిర్వహించిన సెలబ్రేషన్స్ లో తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన అనంతరం చిన్నస్వామి స్టేడియంలో రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, టీ20 సహా ప్రధాన దేశవాళీ మ్యాచ్ లేవీ నిర్వహించలేదు. అయితే ఐపీఎల్ మ్యాచ్ లను హోం గ్రౌండ్ లో ఆడించాలన్న ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా ఆర్సీబీ యాజమాన్యం సంబంధిత అధికారులతో కలిసి తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్ సీఏ), పోలీసు శాఖ నుండి పర్మిషన్ లభించింది. చిన్నస్వామి స్టేడియం మాకు సొంతగడ్డ మాత్రమే కాదు.. ఒకటీమ్ గా మా గుర్తింపు అక్కడే పుట్టింది. బెంగళూరు అభిమానులు అందించే శక్తి మా ఆటగాళ్లకు ఎంతో ఇన్స్పిరేషన్ అని ఆర్సీబీ పేర్కొంది. ముందస్తు ఒప్పందం ప్రకారం రాయ్ పూర్ లో రెండు మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు తెలిపింది.