ఐపీఎల్ కొత్త సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో బెట్టింగ్ ఊబిలో పడి.. బతుకును ఛిద్రం చేసుకోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. క్రికెట్ను కేవలం ఒక స్పోర్ట్ గా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్ లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చిందన్నారు. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై తమ ప్రత్యేక నిఘా ఉందన్నారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.