ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని లోకభవన్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్బార్ హాల్లో జరిగిన వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సమీరా నజీర్ దంపతులు కేక్ కట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ దంపతులు.. గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, గవర్నర్ జాయింట్ సెక్రటరీ పి.ఎస్. సూర్య ప్రకాష్, డిప్యూటీ సెక్రటరీ కె. రఘు, ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ అధికారులు మరియు సిబ్బంది గవర్నర్ను మరియు ప్రథమ మహిళను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.